Post content
" మనిషి విలువ నోరు చెబుతుంది " - చక్కనికథ ================================ ఒకసారి విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ ...... వేటాడుతూ ....... అడవిలో ఒకరికొకరు దూరమైనారు. ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా ........ అతన్ని చూసిన విక్రమాదిత్యుడు ...... " సాధు మహరాజ్........ ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా....... ? అని అడిగాడు. ఆ అంధ సాధువు ఇలా అన్నాడు: " మహారాజా......! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు " అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో ...... " మహాత్మా........ మీకు నేత్రాలు కనిపించవు కదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు....? " అని అడిగారు . అంధుడైన సాధువు ఇలా చెప్పాడు: " మహారాజా....! నేనా ముగ్గురినీ, మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను. అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో, "ఏమిరా, గుడ్డివాడా.....! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు. కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, "సూర్ దాస్! ఇటు ఎవరైనా వెళ్ళారా....?" అని అడిగాడు. చివరకు మీ మంత్రి వచ్చి , " సూర్ దాస్ జీ ! ఇటు ఎవరైనా వెళ్ళారా......? " అని అడిగారు ఇప్పుడు మీరు వచ్చి , " సాధు మహరాజ్! ఇటు ఎవరైనా బాటసారులు వచ్చి వెళ్ళారా ...... ?" అని అడిగారు. "మహారాజా! ఒక వ్యక్తి యొక్క నోటి నుండి వచ్చే మాటల ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ ఏమిటో గుర్తించవచ్చు" అని ఆ సాధువు వివరించారు. సర్వే జనాః సుఖినోభవంతు 🌺🙏